ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్ కట్టడికి విధించిన ఆంక్షల ఫలితం కనిపిస్తోంది. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయి. వరుసగా మూడోరోజు మరణాలు నాలుగు వేలకు దిగువనే నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా శుక్రవారం 20,80,048 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,73,790 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మొదటిసారి 45రోజుల తరవాత కొత్త కేసుల్లో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. అలాగే 24గంటల వ్యవధిలో 3,617మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు సంఖ్య 2.77 కోట్లకు పైబడగా.. కరోనా కాటుకు 3,22,512 మంది బలయ్యారు.
వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడంతో క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 22,28,724 మంది కొవిడ్తో బాధపడుతుండగా.. క్రియాశీలరేటు 8.50శాతానికి చేరింది. రికవరీ రేటు 90.34శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 2.5కోట్లమందికి పైగా వైరస్ను జయించారు. నిన్న ఒక్కరోజే 2,84,601 మంది ఈ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వరుసగా 16వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా నివారణ టీకా కార్యక్రమం కింద ఇప్పటిరకు 20,89,02,445 డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 30,62,747 డోసులు పంపిణీ చేశారు.