మేం ఎవ్వరినీ చిన్న చూపు చూడం – పూజ్య చిన జియ్యర్ స్వామి

chinna jeeyar


ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి తాము వచ్చామని, వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు తమకు లేదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి అన్నారు.
ఇటీవల ఆయన కొందరు దేవతలను కించ పరిచేలా చిన జియ్యర్ స్వామి వ్యాఖ్యానించారంటూ విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ గ్రామ దేవతలను తూలనాడినట్లు చేస్తున్న ప్రచారం సరికాదని హితవు పలికారు.

”ఇవాళ లక్ష్మీదేవి పుట్టినరోజు. పాలసముద్రంలో పుట్టి భగవంతుడి దగ్గరకు చేరిన రోజు. ఇవాళ అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం అని చెప్పాలి. మహిళ.. శక్తికి కేంద్రం. ప్రపంచంలోని మహిళలందరికీ మంగళా శాసనాలు. మన సంస్కృతిలో మొదట చెప్పేది.. మాతృదేవోభవ అనే. వారికి మన ఆదరణ, గౌరవం లభించాలి. ఆరాధ్య స్థానాన్ని కూడా కల్పించాలి. జ్ఞానం చూసి ఆరాధించాలని రామానుజాచార్యులు చెప్పారు. జ్ఞానం చూసి దళితులకూ ఆరాధ్య స్థానం కల్పించారు. లోకానికి ఉపకరించే జ్ఞానం, భక్తి ఉన్నవారందరూ ఆరాధనీయులే. రామానుజ స్వామి పరంపరంగా వచ్చిన వాళ్లం మేం. జ్ఞానంలో ఉన్నతులైన హరిజనులు, గిరిజనులకు ఆరాధన స్థానం కల్పించాం. మనిషికి జన్మ కారణం కాదు.. ఆరాధనకు జ్ఞానమే కారణమని మహనీయులు నిరూపించారు.”

”తిరుప్పాణ్‌ అనే హరిజనుడు.. జ్ఞానానికి భగవత్‌ మార్గాన్ని తెరవగల మహనీయుడు. మనిషి బ్రాహ్మణుడా? హరిజనుడా? గిరిజనుడా? అన్నది పక్కన పెట్టి, ఆరాధనకు తగిన వ్యక్తులు అవుతారని ఎంతోమంది నిరూపించారు. రామానుజల కాలంలోనే ఆయన బోధనల వల్ల ఎంతో మంది ప్రేరణ పొందారు. అందులో ఆదివాసీ జనం కూడా ఉన్నారు. వాళ్లందరినీ సంప్రదాయం పాటించే వారిగా తీర్చిదిద్దారు. ఆదివాసీలు, హరిజనులు అన్న తేడా లేకుండా అడుగు వర్గాలు, బడుగు వర్గాలు సామాజిక ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆశించిన ఆచార్యుడు రామానుజాచార్యులు. దాన్ని మళ్లీ పునరుద్ధరించిన మహనీయుడు మా గురువు పెద్ద జీయర్‌స్వామి. ఆయన అడుగు జాడల్లోనే మేమంతా వచ్చాం. ఒకప్పుడు సమాజంలో మహిళలకు మంత్రం అందకూడదని చెప్పేవారు. రామానుజ పరంపరలో మహిళలు కూడా మంత్ర పఠనానికి అర్హులే అని వాళ్లకు రామానుజులు సమానతను కల్పించారు. మహిళలు మంచి మార్గంలో సాగాలని మంగళా శాసనాలు చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లోని మహిళలు సమాజ ప్రగతి భాగస్వాములు కావాలని కోరుతున్నాం.”

”ఈ మధ్య కొన్ని రకాల వివాదాలు తలెత్తాయి. అవి సబబా? కాదా? అనేది వినే వాళ్లకు వదిలేస్తున్నాం. ఆదివాసీ జనాలకు, ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చినవాళ్లం కాబట్టి, అలాంటి వాళ్లను చిన్నచూపు చూసేలా మాట్లాడే అలవాటు మాకు లేదు. అందరినీ ఆదరించాలని అంటాం. ‘స్వీయ ఆరాధన.. సర్వ ఆదరణ’ మా నినాదం. నేను దేనిని నమ్ముతానో దాన్ని చక్కగా ఆరాధించుకోవాలి. అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు కదా! ప్రపంచంలో ఎన్నో మార్గాలుంటాయి. ఎన్నో రకాల అలవాట్లు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వాళ్లు వాళ్ల మార్గంలో సవ్యంగా ఉండేలా ఆదరించాలి. అందరినీ ఆరాధించాల్సిన అవసరం లేదు. అందుకోసం మారనవసరం లేదు. మన పద్ధతిలో మనం ఆరాధించుకోవాలి. 2002వ సంవత్సరం నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఒకరిని లేదా, కొంతమంది దేవతలను చిన్న చూపు చూసేలా మాట్లాడానని అనుకోవడం పొరపాటు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేటప్పుడు దానికి పూర్వాపరాలు చూడటం చాలా అవసరం. అది లేకుండా మధ్యలో కొంత భాగాన్ని తీసుకుని, ‘ఈ వ్యక్తి ఇలా అన్నాడు’ అని అనడం హాస్యాస్పదంగా ఉంటుంది” అని చినజీయర్‌ స్వామి అన్నారు.

”ఆదివాసుల సంక్షేమం కోసం వికాస తరంగిణి ద్వారా అనేక సేవలు అందించాం. ప్రజలను ప్రభావితం చేసేటువంటి దేవతలను చిన్నచూపు చూసే పద్ధతిని ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించం. ఆ పేరుతో అరాచకాలను సృష్టించే వాళ్లను అరికట్టాల్సిన అవసరం ఉంది. పనికట్టుకొని పెద్ద వివాదాన్ని సృష్టిస్తున్నారు. నిజంగా సామాజిక హితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి. విషయం తెలుసుకోవాలి. తర్వాత సరైన విధానంలో స్పందించాలి. పబ్లిసిటీ కోరుకునే విధంగా చేసే ఇలాంటి అల్ప ప్రచార కార్యక్రమాల్లో ఎలాంటి సామాజిక హితం ఉండదు. సమాజం, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా అందులో మేం ఉంటాం. అలాంటి వాళ్లను కలిసేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాం. సమాజం అనే పెద్ద వేదిక మీద పనిచేసే సమయంలో అందరూ కలిసి పనిచేస్తేనే అది సమాజానికి ఆరోగ్యకరం. ఆ సమాజమే క్రమంగా వికాసం వైపు సాగుతుంది” అని చినజీయర్‌ అన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
CLOSE ADS
CLOSE ADS